4-9-2025
—————————–
రైతులకు సరిపడా యూరియా అందివ్వాలి!
కామ్రేడ్ తోట జీవన్న, సిపిఐ (ఎం.ఎల్) రెడ్ స్టార్ పార్వతిపురం మన్యం జిల్లా కార్యదర్శి
పార్వతీపురం :
యూరియా ఎప్పుడు వస్తుందని రైతాంగo ఎదురుచూస్తున్నదని, అందుబాటులోకి ఎప్పుడు వస్తుందా? అని సిపిఐ (ఎమ్.ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న అన్నారు,. వీరఘట్టం మండల కేంద్రం లో రైతులకు యూరియా కొరత పై నిరసన తెలుపుతూ మాట్లాడుతూ,,,, తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు, ఇదిగో యూరియా… అదుగో యూరియా…అందుబాటులో యూరియా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్న అధికారులు రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుండి రైతులకు యూరియా సరఫరా లో జిల్లా యంత్రాంగం విఫలమైందన్నారు. గురువారం పార్వతీపురం మండలంలో దాదాపు యూరియా పంపిణీ జరిగే ఆనవాళ్లు కనబడలేదు అన్నారు. యూరియా కోసం రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. డిమాండ్ కు సరిపడా యూరియా పంపిణీ చేయడంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలోని ఒక్కో మండలానికి వందలకొద్దీ టన్నుల యూరియా అవసరం కానున్న నేపథ్యంలో అధికారులు పదులకొద్దీ టన్నుల యూరియా కేటాయించామంటూ ప్రకటనలు గుప్పించడం హాస్యాస్పదమన్నారు. సకాలంలో అదును ప్రకారం యూరియా పంటకు వేయక పోవడం వలన చేను ఎదుగుదల అవటం లేదని, పంట దిగుబడి వచ్చే అవకాశం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. పంట దిగుబడి లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండవని వాపోతున్నారన్నారు. జిల్లా లో సాగు చేస్తున్న రైతులు యూరియా దొరకక అమ్మోనియో, దుబ్బు గుళికలు కలిపి చేలకు చల్లుకునే దుస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . సరఫరా చేసిన అరకొర యూరియా పలుకుబడి ఉన్న వారికే దొరికిందని, తామయితే బ్లాక్ మార్కెట్లో బస్తాకు 200 రూపాయలు అదనంగా ఇచ్చి ఒకటి రెండు బస్తాలు తెచ్చుకోగలిగామని రైతు తమ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇదిగో యూరియా… అదిగో యూరియా… అని వస్తున్న ప్రకటనలు చూసి యూరియా కోసం పడికాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. అధికారులు ప్రకటనలు ప్రక్కన పెట్టి క్షేత్రస్థాయిలో రైతుల అవసరాలను గుర్తించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో యూరియా సరఫరాలో ఎటువంటి వైఫల్యం లేదని అధికారులు ప్రకటిస్తున్నారని… ఒకవేళ రైతులకు సరిపడా యూరియా ఇచ్చామని అనుకుంటే పోలీసు సహాయం లేకుండా యూరియా పంపిణీ చేయగలరా…? అని ప్రశ్నించారు. యూరియా సరఫరా చేయకుండా రైతుకు సాగు కష్టాలు కలిగించడం సరికాదన్నారు. తక్షణమే జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందివ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఏ రోజుకు ఆరోజు ఏ గ్రామంలో యూరియా ఎంత ఇస్తున్నారో ముందు రోజు ప్రకటించాలని కోరారు.ఈ కార్యక్రమం లో సిపిఐ( ఎమ్.ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సూరయ్య, బొత్స మోహన్ రావు, గుజ్జు జనార్దన్, సీతమ్మ, రామ్మూర్తి, శ్రీనివాస్, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు,,,,
